మాఘ పురాణం 16 వ అధ్యాయం | Maghapuranam 16th Day Story in Telugu

మాఘ పురాణం 16 వ అధ్యాయం :

ఆడకుక్కకు విముక్తి కలుగుట :

దిలీప మహారాజా! సుమిత్రుని కథ ఈశ్వరుడు పార్వతీదేవి చెప్పిన రీతిగా విన్నావు కదా! ఇంకొక కథను పార్వతికి ఈశ్వరుడు ఈవిధముగా చెప్పెను. అదెట్లన –
మాఘమాసములో మాఘస్నానములు చేయువాడు గొప్ప ధనశాలి యగును. వర్తమాన కాలమందు ఎన్ని కష్టములు అనుభవించుచున్నప్పటికీ మాఘస్నానం మొదలిడిన తరువాత వారి కష్టములు క్రమేపీ సమసిపోవును. మాఘశుద్ధ దశిమనాడు నిర్మలమైన మనస్సుతో శ్రీమన్నారాయణుని పూజించిన యెడల శ్రీహరి కటాక్షమునకు పాత్రుడగును. అందులో అణుమాత్రమైననూ సంశయం లేదు. అని పార్వతీదేవితో శంకరుడు వివరించుచుండగా పార్వతి మరల ఇట్లు పలికెను.
“నాదా! శ్రీలక్ష్మీ నారాయణుల వ్రతము చేసినయెడల మనోవాంఛాఫలసిద్ధి కలుగునని చెప్పియుంటిరి గదా! ఆ వ్రాత విధానమెట్టిదో ఎటుల ఆచరించవలెనో వివరంగా తెలియపరచు’డని పార్వతీదేవి పరమేశ్వరుని కోరింది.

అంత మహేశ్వరుడు పార్వతితో ఇట్లు చెప్పసాగెను. “మాఘ శుద్ధ దశమినాడు ప్రాతః కాలమున కాలకృత్యములు తీర్చుకొని స్నానం చేసి నది ఒడ్డున గాని, ఇంటివద్ద గాని, మంటపము వుంచి, ఆ మంటపమును ఆవుపేడతో అలికి పంచారంగులతో మ్రుగ్గులు పెట్టి మంటపం మధ్య ఎనిమిది రేకుల పద్మము వేసి, అన్నిరకాల పుష్పములు ఫలములు తీసుకువచ్చి లక్ష్మీనారాయణులను మంటపపు మధ్యమున వుంచి గంధం, కర్పూరం, అగరు మొదలగు ద్రవ్యములు విగ్రహాలకు రాసి పూజించవలెను. రాగి చెంబులో నీళ్ళు పోసి, మామిడి చిగుళ్ళను వుంచి దానిపై కొబ్బరికాయ పెట్టి, క్రొత్త వస్త్రము నొకదానిని కప్పి లక్ష్మీనారాయణుల ప్రతిమ ప్రతిష్ఠించి పూజించవలెను. ఆ మంటపపు మధ్యలో సాలగ్రామమును వుంచియొక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి వారిచేత పంచామృత స్నానం చేయించి తులసి దళము తోను, పుష్పాలతోను పూజించి ధూపదీప చందనాగరు పరిమళ వస్తువులుంచి నైవేద్యము చెల్లించవలెను.

తరువాత రాగిపాత్రలో నీరుపోసి అర్ఘ్యప్రదానమివ్వవలెను. అటు తరువాత సూర్యనారాయణ స్వరూపుడగు శ్రీరామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించవలెను.

మాఘమాసస్నానం చేయువారు వారి తల్లిదండ్రులు బంధుమిత్రుల సమక్షంలో మాఘమాస వ్రతము చేయవలయును. ఒక సద్బ్రాహ్మణునకు బియ్యము, బెల్లము, ఉప్పు, పప్పు కాయగూరలు పండ్లు మొదలగునవి ఒక పాత్రయందు ఉంచి గాని, క్రొత్త గుడ్డలో మూటగట్టి గాని, దానమియ్యవలయును. మాఘపురాణమును స్వయముగా పఠించునపుడు గాని, లేక వినునప్పుడు గాని చేతిలో అక్షతలు వుంచుకొని భక్తితో శ్రీమన్నారాయణుని ధ్యానించుకొని కొన్ని అక్షతలు భగవంతునిపై వుంచి మరికొన్ని అక్షతలు తలపై వేసుకోవలయును. గాన ఓ శాంభవీ! మాఘస్నానం చేసి మాఘశుద్ధ దశమినాడు లక్ష్మీనారాయణులను నిష్ఠతో పూజించిన యెడల ఎటువంటి మహాపాపములైనను నశించిపోవును. ఇందులకొక ఉదాహరణ కూడా తెలియజేసెదను. సావధానురాలవై వినుము.
గౌతమమహర్షి ఒకనాడు తన శిష్యులతో గూడి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తరదిశకు బయలుదేరాడు. వారు అనేక పుణ్యనదులలో స్నానములు చేయుచు ప్రసిద్ధ క్షేత్రములను దర్శించుచు మార్గమందున్న మునిపుంగవులతో ఇష్టాగోష్టులు జరుపుకొనుచు ప్పటికి మాఘమాసము ప్రవేశించుట వలన కృష్ణానదిలో స్నానము చేయవలయునని ఆ ప్రాంతమునకు వచ్చి విడిది చేసిరి. గౌతమముని తన శిష్యునితో గూడి కృష్ణా నదిలో సూర్యోదయ సమయంలో స్నానం చేసి తీరముననున్న ఒక రావిచెట్టు వద్దకు వచ్చి
శ్లో!!మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే!
అగ్రతశ్శివ రూపాయ వ్రుక్షరాజాయ తే నమః!!

అని రావిచెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆసీనులయి శ్రీహరిని విధియుక్తముగా పూజించిరి. తరువాత శిష్యులందరికీ మాఘమాస ప్రభావమును వినిపించిరి. ఈవిధముగా ప్రతిదినము ఆచరించుచుండగా మాఘశుద్ద దశమినాడు ఆ చెట్టు మొదట మండపమేర్పరచి మ్రుగ్గులు, బొట్లు పెట్టి మామిడాకు తోరణాలు కట్టి అలంకరించారు. ఆ మంటపము మధ్యలో శ్రీహరి చిత్రపటం వుంచి పూజించినారు. ఆవిధంగా పూజించుచున్న సమయంలో ఒక ఆడకుక్క వచ్చి భగవంతునికి చేయుచున్న పూజావిధానమంతయు రెప్పవాల్చకుండా దీక్షతో చూచుచు ఆ రావిచెట్టునకు ఎదురుగా కూర్చొని ఉండెను. శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి. ఆ కుక్క అచటినుండి లేచి ఉత్తర దిశవైపు మళ్ళీ మరల తూర్పు తిరిగి, ఆ వైపునుండి దక్షిణ దిశకు కడలి మరల యధాప్రకారం పడమటి దిశలోనే కూర్చుండెను. శిష్యులు మరల బెదరించిరి. ముందు చేసినతులే రెండవసారి కూడా ఆ మండపం చుట్టూ తిరిగి వచ్చెను. శిష్యులు ఆ మంటపం చుట్టూ ప్రదక్షిణ చేసినందున అది మాఘమాసము అయి ఉన్నందున వెంటనే ఆ కుక్క రూపము వదలి ఒక రాజుగా మారిపోయాడు. ఆ రాజు సకలాభరణాలు ధరించిన వాడై మునుల ఎదుట నిలబడి మునులందరికీ నమస్కరించెను. అక్కడ నున్న ఆ కుక్క రాజుగా మారిపోవుట, చూచినా మునులు గౌతమ మహర్షి కూడా అమితాశ్చర్యం నొందిరి.

ఓయీ! నీవెవ్వరవు? నీవిట్లు మారుటకు కారణమేమి? అని గౌతముడు ప్రశ్నించాడు. మునిచంద్రమా! నేను కళింగరాజును. మాది చంద్రవంశం. నా పేరు జయచంద్రుడు. నాకు అన్ని విద్యలయందునూ ప్రావీణ్యం గలదు. నాదేశ ప్రజలను ధర్మమార్గమున పరిపాలన చేయుచూ వున్నాను. దానధర్మములనిన నాకు అతిప్రేమ. నేను అనేక దానాలు చేసియుంటిని. గోవు, భూమి, హిరణ్య సాలగ్రామదానాలు కూడా చేసియున్నాను. ఎక్కువగా అన్నదానం తిలదానం చేసియున్నాను. అనేక ప్రాంతములలో చెరువులు త్రవ్వించినాను. నూతులు త్రవ్వించి బాటసారులకు నీడనిచ్చు నిమిత్తం అన్నసత్రములు మంచినీటి చలివేంద్రములు మరెన్నో పుణ్యకార్యాలు చేసియున్నాను. అనేక దేవాలయాలను నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించినాను. సద్బ్రాహ్మణుల చేతను, వేదాలు చదువు పండితుల చేతను ఎన్నో క్రతువులు చేయించినాను. పురాణాలలో వున్న అన్ని ధర్మాలను చేసియున్నాను. కాని నేనిలా కుక్కనయ్యాను. దానికి కారణం లేకపోలేదు. ఆ కారణం కూడా మీకు విశదపరచెదను వినుడు.

ఒకానొక దినమున ఒక మునిపుంగవుడు గొప్ప యజ్ఞ మొకటి తలపెట్టాడు. యజ్ఞంచేయాలన్న సామాన్య విషయం కాదు కదా! దానికి కావలసిన దానం వస్తుసముదాయం చాలా కావలెను. గాన ఆ మునిపుంగవుడు నావద్దకు వచ్చి అర్ధించెను. మునిసత్తముడు వచ్చిన వెంటనే ఎదురేగి కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నా శిరస్సుపై జల్లుకొని కుశల ప్రశ్నలడిగితిని. మునియు మిక్కిలి సంతసించి రాజా! నీకు గుప్త విషయములు తెలియజేయుదును. ఈ మాసములో మకరరాశియందు సూర్యుడు ప్రవేశించును. ఆ దినము సూర్యోదయం అయిన తరువాత నీవు స్నానం చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహాత్యము చదవుటగాని, లేక వినుగా గాని చేయుము. దానివలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతియేగాక అశ్వమేధ యాగం చేసినయెడల ఎంతటి ఫలితము కలుగునో అంతటి ఫలము గాని, తీర్థ స్నానాలు చేయగా వచ్చిన ఫలము గాని లేక దాన పుణ్యములు అనగా పంచ యాగాలు చేసినంత ఫలము గాని పొందగలవు. మాఘ శుద్ధ సప్తమీ ఆదివారం వచ్చినగాని, దశమీ ఆదివారం వచ్చిన గాని, ఉదయమే స్నానం చేసినాను మరియు మాఘ పౌర్ణమి రోజు ఉదయమున స్నానము చేసినచో మానవుడు ఎటువంటి పాపములనైనను విడువగలడు.

ఒకవేళ ఇతర జాతుల వారైననూ మాఘమాసమంతటా నిష్ఠతో నదీ స్నాన మాచరించి దానధర్మాలు మాఘ పురాణము పఠించినను లేక వినినను మరుజన్మలో బ్రాహ్మణుడై జన్మించును. అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా నేను అతనిని అవమానించినటుల మాటలాడి ఇట్లంటిని.
“అయ్యా మునిసత్తమా! మీరు పలికిన విషయములు నాకు తెలియును. అవన్నియు బూటకములు. వాటిని నేను యధార్ధములని అంగీకరింపను. ఏవో అతిశయోక్తులు తప్ప మరొక్కటి కాదు. గాన నేను మాఘస్నానములు చేయుటగాని, దాన పున్యాదులు జేయుట గాని, పూజా నమస్కారములు ఆచరించుట గానీ చేయను. చలిదినములలో చన్నీళ్ళు స్నానములు చేయుట ఎంతకష్టము! ఇకనాకు ఈ నీతి బోధలు చెప్పకుడు నాకున్న ఫలము చాలు” అని ఆ మునితో అంటిని.

ణా మాటలకు మునికి కోపం వచ్చినది. ముఖం చిట్లించుకొని సరే, నేను చెప్పవలసినది చెప్పితిని. అది ణా ధర్మము అని యజ్ఞమునకు కావలసిన ధనమును తీసుకోకుండా వెడలిపోయినాడు.

అంతట నేను ఆ ముని చేతులు పట్టి బ్రతిమలాడగా ఎట్టకేలకు ముని అంగీకరించి ధనము తీసుకొని పోయెను. ఆవిధంగా నేను కొంతకాలము రాజ్యమేలి ప్రాణములు విడిచితిని. తరువాత నాకు కుక్క జన్మయే వచ్చినది. నా పాపఫలమేమో గాని కుక్కగా ఏడుజన్మలూ బాధపడితిని. ఇప్పుడు మీరు చేయు పూజాస్తాలము చుట్టూ మూడు పర్యాయములు ప్రదక్షిణాలు చేసితిని గాని ణా పూర్వజన్మ నాకు కలిగినది. దైవయోగమున ఎవ్వరునూ తప్పించలేరు కదా! ఇటుల కుక్క జన్మతో వుండగా మరల నాకు పూర్వజన్మ ఎటుల సంక్రమించినదో వివరింప వేడెదను” అని రాజు పలికెను.

ఆ రాజు చెప్పిన వ్రుట్టాన్తమునకు ఆ ముని ఆశ్చర్యపడి మాఘ మాసమును నీవు చులకనగా చూచుట వలన ఎంతటి విపత్తు గతిల్లెనో అనుభవమే చెప్పుచున్నది. నీవద్దకు వచ్చిన ముని సత్తముడు ఉత్తముడు. అతడు పలికిన విషయములన్నియు యధార్థములే. నీవు కుక్కవై ఎటుల పవిత్రుడవైతివో ఆ వృత్తాంతమును వివరించెదను. సావధానుడవై ఆలకింపుము.

నేను నా శిష్యులతో ఈ మాఘమాసమంతయు కృష్ణవేణీ తీరమందుండిన కృష్ణా నదిలో మాఘమాసమంతయు స్నానములు, జపములు చేసి తిరిగి మరొక పున్యనడికి పోవుదామని వచ్చి యుంటిమి. మేమందరమూ ఈ వుర్క్ష రాజము క్రింద విష్ణు విగ్రహాన్ని పట్టి పూజించుకొనుచున్నాము. కుక్క రూపంలోనున్న నీవు దారినిపోతూ ఇచ్చటి నైవేద్యమును చూసి తినవలయుననెడి ఆశతో పూజ సమీపమునకు వచ్చి కూర్చుంటివి. అప్పుడు నీవు ఎలాగున్నావో తెలుసా! నీశరీరము బురద మైల తగిలి వున్నది. చూచుటకు చాలా అసహ్యంగా వున్నావు. పరిశుద్ధమై భగవంతుని పూజ చేయుచున్న సమయములో అచటకు జంతువూ గాని, పక్షి గాని వచ్చియున్న దానిని తరిమివేయుట సహజమే కదా! నీవు అసహ్యంగా ఉన్నందున శిష్యులు నిన్ను తపోదండంతో తరిమిరి. నైవేద్యం తినవలయుననెడి ఆశతో ఈ మండపం చుట్టూ తిరిగి యధాస్థానమునకు వచ్చి కూర్చుంటివి. మరల ణా శిష్యులు నిన్ను కొట్టబోవుటచే తిరిగి మళ్ళీ వచ్చినావు. అట్లు మూడు పర్యాయములు తిరుగుటచే భగవంతుడు నీ రూపమును మార్చి నిజరూపమును ప్రసాదించినాడు. 
అనగా మాఘమాస ఫలం భగవంతుని మండపం చుట్టూ తిరగడం వలన పునర్జన్మ వచ్చినదన్నమాట. ఇక మాఘమాసమంతాయూ నదిలో స్నానం చేసి భగవంతుని ధ్యానించి పురాణ పఠనం చేసినచో ఎంతటి ఫలం వచ్చునో ఊహించుకొనుము అని గౌతమ ఋషి చెప్పగా రాజు మిగుల సంతోషించి గౌతమ ఋషికి అతని పరివారమంతటికీ నమస్కరించు చుండగా అంతలో ఆ రావిచెట్టులో నున్న ఒక తొర్రనుండి ఒక మండూకం బైటకు వచ్చి గౌతమ ఋషి పాదములపై బడి బెక బెకమని అరచి అటు ఇటు గెంతుచుండెను. హఠాత్తుగా కప్పు రూపమును వదలి ముని వనితగా మారిపోయెను.

ఆమె నవ యౌవనవతి అతి సుందరాంగి. ఆమె గౌతమ ఋషిని చూడగానే తనకు జ్ఞానోదయమై పూర్వజన్మ వృత్తాంతమంతయు జ్ఞప్తికి వచ్చ్సినది. అంత గౌతమ ముని అమ్మాయీ! నీవెవ్వరి దానవు? నీ నామధేయమేమి? నీ వృత్తాంతం తెలియజేయుము అని ప్రశ్నించిరి. గౌతమ మునిని చూడగానే తన పూర్వ జన్మ వృత్తాంతం తెలియుటచే ఇట్లు చెప్పదొడంగెను.


మాఘ పురాణం 17 వ అధ్యాయం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
Click Here : Magha puranam Day 17

key words : Magha Puranam , Magha purana parayana, Magha puranam PDF Download, Magha puranam in telugu.

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS