Drop Down Menus

Significance of Margasira Masam Telugu | ముక్తికి మార్గం - మార్గశిర మాసం మాసాలన్నింటిలో అగ్రగణ్యమైనది

ముక్తికి మార్గం - మార్గశిర మాసం

చాంద్రమాన సంప్రదాయాన్ని అనుసరించి చంద్రుడు మృగశిర నక్షత్రంలో ఉండే నెల మార్గశీర్షం. ఇది ప్రకృతి కాంతకు సీమంతం. తుషార బిందువుల హేమంతం. శ్రీమహావిష్ణువుకు ఇష్టమైన మాసం. 'మాసానాం మార్గశీర్షం'- మాసాల్లో తాను మార్గశిరమాసాన్ని అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోని విభూతియోగంలో. ఈకాలంలో పొలాలనుంచి ధాన్యం ఇళ్లకు చేరి ప్రజలు సంతోషంగా ఉంటారని ఉత్తమ మాసంగా పరిగణిస్తారు.

ఈ మాసమంతా శ్రీ విష్ణువును తులసీ దళముతో పూజించడం, పుణ్యప్రదం. ద్వాదశినాడు పంచామృతాలతో అభిషేకం చేయవలెను. శ్రీ విష్ణుతోపాటు సూర్యున్ని కూడా పూజించి శుభాలను పొందాలని, ఏ పనిచేస్తున్నా ఈ మాసంలో ‘ఓం దామోదరాయనమః, ఓ నమో నారాయణయనమః’ అనే మంత్రాన్ని పఠించాలని శాస్త్ర వచనం.

ప్రతిరోజు బ్రాహ్మీముహూర్తంలో తులసి వృక్ష సన్నిధిలోని మృత్తికతో, తులసి ఆకులను తీసికొని ‘ఓం నమో నారాయణాయ’ అనే మంత్రాన్ని పఠిస్తూ శరీరానికి పూసుకుని స్నానమాచరించాలి.

Also Readఐశ్వర్యాన్నిచ్చే ఐదువారాల అద్భుత వ్రతం - మార్గశిర లక్ష్మివార వ్రత విధానం

సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించగా వచ్చే ధనుస్సంక్రమణంతో సంక్రాంతి శోభకు స్వాగతం పలిేకందుకు ప్రతీ పల్లె సిద్ధమవుతుంది. సంక్రాంతి పండుగకు నెలరోజులు ముందుగా వచ్చే ధనుర్మాసం ఆధ్యాత్మికతతో ముడిపడి ఉంది.

సంక్రాంతిశోభ: హరిదాసు ఆగమనం సంక్రాంతి సంబరాల శోభకు సంకేతమే. ధనుర్మాస నెల ఆరంభం నుంచి చాత్తాద శ్రీవైష్ణవ మతానికి చెందిన హరిదాసులు తమదైన ప్రత్యేకశైలిలో వేషధారణ చేసి తమ గానామృతంతో గ్రామవీధుల్లో తిరుగుతారు. హరిదాసులు వస్తున్నారంటే చిన్నారుల్లో సందడే సందడి. దోసెళ్ళతోను, పళ్ళాలతోను బియ్యం తీసుకువచ్చి అక్షయపాత్రలో పోస్తారు. ప్రతీ ఇంటా సంక్రాంతి ముస్తాబులు ఆరంభిస్తారు. శ్రీహరి నామస్మరణంతో తిరిగాడే హరిదాసు వృత్తికి పురాణ ప్రాశస్త్యం ఎంతో ఉంది.

అక్షయపాత్ర విశిష్టత: అక్షయ అనగా ఎప్పుడూ నిండుగా ఉండేదని అర్ధం. శ్రీమహావిష్ణువు సూర్యభగవానుడికి అందించిన ఈ అక్షయపాత్రను పాండవుల వనవాస సమయంలో ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఇచ్చాడని తదుపరి ధర్మరాజు పట్టాభిషేకం సమయంలో ఈ పాత్రను ఎవరికి అందించాలన్న ప్రశ్నకు కృష్ణ్ణుడు బదులిస్తూ వేయిగంటల మండపాన్ని కట్టించి బ్రాహ్మణులకు భోజనం పెట్టమని ఆ సమయంలో గంటలు మోగాలని శ్రీకృష్ణుడు చెప్పినట్లు పురాణ కథనం.

ఆ ప్రకారం ధర్మరాజు బ్రాహ్మణులకు భోజనం పెట్టినా గంటలు మోగకపోవడంతో ధర్మరాజు శ్రీకృష్ణున్ని ప్రార్ధించాడని అప్పుడు చాత్తాది శ్రీవైష్ణవునకు భోజనం పెట్టమని ఆదేశించాడు. చాత్తాది శ్రీవైష్ణవుడు తాను భోజనం చేయనని స్వయంపాకం ఇమ్మని కోరినట్లు ఆ ప్రకారం అతడు స్వయంపాకాన్ని తీసుకువెళ్ళి వండి గోదాదేవీ సహిత శ్రీకృష్ణమూర్తిని అర్చించి నివేదన చేసి అప్పుడు అతను భుజించగా గంటలు మోగినట్లు ప్రతీతి అని హరిదాసులు చెబుతుంటారు. అప్పుడు ధర్మరాజు అక్షయపాత్రను చాత్తాది శ్రీవైష్ణవునకు ఇచ్చినట్లు నాటి నుండి వంశపారంపర్యం గా కులవృత్తిగా ఈ హరిదాసులు అక్షయపాత్రను ధరించి గ్రామసంచారం చేస్తున్నట్లు వీరు చెబుతారు. ధనుర్మాసం నెలరోజులూ సూర్యోదయానికి పూర్వమే శ్రీకృష్ణ్ణ గోదాదేవీలను అర్చించి తిరుప్పావై పఠించి అక్షయపాత్రను ధరించి గ్రామ సంచారం ప్రారంభిస్తామని తెలిపారు. గ్రామ సంచార ప్రారంభం నుంచి తిరిగి వచ్చేవరకు హరినామ సంకీర్తన తప్ప ఇతరులతో సంభాషణ చేయడంకానీ, అక్షయపాత్ర దింపడం కానీ చేయరాదని చెబుతారు.

తెలతెల్లవారుతుండగానే నారదముని వేషధారణలో హరిలో రంగ హరి అంటూ మాత్రం గ్రామాల్లో హరిదాసులు వేకువ జామునే కనిపిస్తుంటారు. ఒక చేతితో చిడతల సవ్వడి... మరొక చేతితో భుజాన వేసుకున్న తుంబుర వారుుస్తూ శిరస్సుపై గుండ్రని గుమ్మడి లాంటి రాగి పాత్ర, మెడలో పూల దండ, కాళ్ళకు గజ్జెలు, నోటితో హరినామస్మరణ ఇవన్నింటితో హరిదాసు గ్రామాల్లో తిరుగుతుంటూ ఆ వీధిలో ఉంటే ఈ వీధి వారికి, ఈ వీధిలో ఉంటే ఆ వీధి వారికి హరిదాసు సవ్వడి వినిపిస్తుంది.

మార్గశిరం ఎన్నో పర్వాలకు నెలవు. మార్గశిర శుద్ధ 'స్కంద షష్ఠి'- శివకుమారుడైన కుమారస్వామి ఈరోజున తారకాసురుని సంహరించాడని ఈ తిథి అతనికి ప్రియమైనదని చెబుతారు. తెలుగువారు దీన్ని 'సుబ్రహ్మణ్య షష్ఠి' అని వ్యవహరిస్తారు. మార్గశిర శుద్ధ ఏకాదశి 'వైకుంఠ ఏకాదశి'. దీనినే 'మోక్ష్తెకాదశి' అనీ అంటారు. ఆ రోజున విష్ణ్వాలయాల్లో ఉత్తరద్వారంనుంచి వెళ్లి దర్శనం చేసుకుంటే మోక్షం తథ్యమని భక్తుల విశ్వాసం. తిరుపతి, శ్రీరంగంవంటి వైష్ణవ క్షేత్రాల్లో ఆరోజు గొప్ప ఉత్సవం. వైకుంఠ ద్వారం సూర్యుని ఉత్తరాయణ ప్రవేశచిహ్నంగా భావిస్తారు. ఈ ఏకాదశి గీతాజయంతి. సమస్త మానవాళికి ధర్మ భాండాగారం, భారతీయ ఆధ్యాత్మ వాఞ్మయంలో శిఖరాయమానం అయిన భగవద్గీతను కృష్ణ భగవానుడు ప్రబోధించిన రోజు. మార్గశిర బహుళ ఏకాదశిని విమలైకాదశి అని, సఫలైకాదశి అని వ్యవహరిస్తారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల సమైక్యస్థితి దత్తాత్రేయుడు. ఈ దత్తజయంతిని మార్గశిరంలోనే శుక్లపూర్ణిమనాడు జరుపుకొంటారు. మార్గశిర శుక్ల త్రయోదశినాడు హనుమద్‌వ్రతం ఆచరించడం పరిపాటి. ఇలా ఎన్నో విశిష్టతలతో భక్తజనావళికి హర్షం మార్గశీర్షం.

"మాసానాం మార్గశీర్షాహం" అన్న గీతాచార్యుల వారి ఉక్తిని బట్టి మార్గశిర ప్రాధాన్యత, ప్రాశస్థ్యం మనకు తెలుస్తున్నాయి.

కార్తీక మాసంలో దీపావళి అనంతరం వచ్చే చలిగాలులలో వాతావరణంలో మార్పు సంభవించి, మనిషిలోని బద్ధకాన్ని, సోమరితనాన్ని పోగొట్టే రీతిలో మన పండుగలు, ఉత్సవాలు రూపొందించబడ్డాయి.

మృగశిర నక్షత్రంతో కూడిన పౌర్ణమి ఈ మాసంలోనే వస్తుంది కనుక మార్గశిర మాసమనెడి పేరు వచ్చింది. ఇది తెలుగు నెలల్లో 9వ నెలగా వచ్చుటవల్ల 9 సంఖ్య శుభప్రదం కావడంవల్ల, ఈ మాసానికి అత్యంత ప్రాధాన్యత కల్గినది.

ఈ మాసంలో వచ్చెడి 'షష్ఠి' ని సుబ్రహ్మణ్య షష్ఠిగా పంచాంగ కర్తలు పేర్కొనిరి. నాగపంచమి, నాగుల చతుర్థి రీతిలోనే సుబ్రహ్మణ్య షష్ఠిని కూడా సర్పాలను దైవస్వరూపులుగా కొలుచుట ఆనవాయితి. ముఖ్యంగా దేవతల సేనాని అయిన సుబ్రహ్మణ్య స్వామి (కుమారస్వామిని ఈ పండుగనాడు కొలుస్తారు. ఈయనకు కార్తీకేయుడు, స్కందుడు, షణ్ముఖుడు అనే పలు నామాలు ఉన్నాయి. పాము రూపానికి, సుబ్రహ్మణ్యస్వామికి గల అనుబంధాన్ని ఇలా చెప్పారు. మూలాధారము నుండి సహస్రారము వరకు వెన్నెముక మధ్య నుండి పాము ఆకారములో ఉండే "కుండలినీ శక్తి” చెప్పబడే సుషుమ్నా నాడియే సుబ్రహ్మణేశ్వరుడు సమాధిస్థితి యందు పుచ్ఛము (తోక) సహస్రారమునందు, శిరస్సు సహస్రారమునందు ఉండును.

మార్గశిర పౌర్ణమిని దత్తజయంతిగా పరిగణించి, దత్తాత్రేయుని   ప్రార్థించడం పరిపాటి.

“అనసూయాత్రి సంభూత దత్తాత్రేయ మహామతే

సర్వదేవాది దేవత్వం మమ చిత్తం స్థిరాకురు" 

అంటూ దత్త స్తవం చేస్తారు.

సౌరమానం రీత్యా మనం మార్గశిరమాసంగా పరిగణించినా, చాంద్రమానం ప్రకారం ధనుర్మాసంగా పేర్కొంటారు. ప్రణవం (ఓంకారం) ధనస్సు వలే ఉంటుంది. కావున మనస్సు అనే వింటినారిని సంధించి, భక్తి అనే బాణంతో భగవంతుని పాదాలను చేరడమే ఈ ధనుర్మాస వ్రత ప్రాశస్థ్యం.

గోదాదేవి విష్ణువును అర్చించే నెపంతో, తెల్లవారుఝాముననే మేల్కొని, ఇతర సఖులను (గోపికలను) మేల్కొల్పడం, తిరుప్పావై పాశురాలతో ప్రాతఃకాల పూజా విశేషాలను వివరిస్తూ 30 రోజులు పాటు 30 పాశురాలతో అర్చిస్తుంది. సరిగ్గా 'భోగి' రోజున వ్రతం సమాప్తమై గోదాకల్యాణం జరుగుతుంది.

అకుంఠిత భక్తితో శ్రీరంగనాథుణ్ణి భర్తగా పొందాలనుకోవడం, ఆ కోరిక సిద్ధించుటకు అత్యంత పవిత్ర భక్తితో స్వామిని వరించడం ప్రధాన అంశాలే అయినా, భక్తుల కోరికలను నెరవేర్చడమే భగవంతునికి ఇష్టం అన్న అంశం నిరూపితమైంది. కాత్యాయనీ వ్రతాన్ని కూడా ధనుర్మాసంలోనే ఆచరిస్తారు.

వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా ఆలయ ఉత్తర ద్వారం నుండి ప్రవేశించడమే మానవులకు వైకుంఠ ప్రవేశంగా భావించడం పరిపాటి. అటువంటి ఆధ్యాత్మిక పర్వదినం ఈ నెలలోనే వస్తుంది.

ముఖ్యంగా ధనుర్మాసముగా చెప్పబడే ఈ వ్రతకాలంలో పొంగలి, దద్యోదనము వంటి నైవేద్యాలు సమర్పించడం ఆరోగ్య ప్రదంగా చాలా మంచిది. ఉదయాన్నే ప్రసాదంగా తినడం వల్ల జీర్ణశక్తి నేత్ర దృష్టి వృద్ధి చెంది, ఎటువంటి అనారోగ్యం లేకుండా చేస్తుంది. పొంగలిలో ఉపయోగించే పెసరపప్పు, బుధ గ్రహ అనుగ్రహం కొరకు నిర్దేశించబడిన పప్పు దినుసులు, చంద్రుని అనుగ్రహం కొరకు నిర్దేశించబడిన బియ్యము వల్ల శరీరము, బుద్ధి సరియైన రీతిలో పనిచేస్తూ ఆరోగ్యానికి తోడ్పడుతాయి.

ఉదయం, సాయంత్రం గోమయంతో తులసి కోటను అలిక, గొబ్బెమ్మలతో దీపారాధన చేయుట వల్ల ఏర్పడిన వాతావరణంతో మనస్సు ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకే మార్గశిరమాసము మనోరంజకమైన ఆవాసానికి నిలయం.

ఏకాదశి రోజున ఉపవాసము ఆచరించుట కేవలం భక్తి కొరకే కాదు. ఆరోగ్యరీత్యా కూడా చాలా మంచిది. ప్రతి పక్షం రోజులకు (15) ఒకసారి వచ్చే ఏకాదశి నాడు ఉపవాసం చేయడం వల్ల జీర్ణశక్తి పెంపొందింపబడి అనారోగ్యం నుండి రక్షణ లభిస్తుంది.

అందువల్లనే భీష్మ ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, శయనైకాదశి, ప్రబోధ ఏకాదశి, ఉత్థాన ఏకాదశి పేర్లతో నెలలో రెండు రోజులపాటు ఉపవాసాన్ని ఆచరించడం మంచిదని, అట్లే జాగరణ చేయడం వల్ల శారీరికంగా, మానసికంగా ఉత్తేజాన్ని పొందెడి లక్ష్యం కూడా దీని వెనుక దాగి ఉన్నది.

గొబ్బెమ్మలను అలంకరించి, ఇలా పాడటం ఆనవాయితి.

"సుబ్బీగొబ్బెమ్మా, శుభము (సుఖము) వియ్యవే

తామర పూవంటి తమ్ముణ్ణియ్యావే

చేమంతి పూవంటి చెల్లినీయవే 

బంతి పూవంటి బావనీయవే 

మల్లెపూవంటి మామనీయవే 

మొగిలిపూవంటి మొగుణ్ణివ్వవే"

ఇలా చలాకీగా, హుషారుగా పాడుకొనే యువతుల గీతాలతో తెలుగు లోగిళ్ళు మార్మోగుతూ ఉంటాయి.

Famous Posts:

Tags: మార్గశిర మాసం, మార్గశిర లక్ష్మివార వ్రత విధానం, Margashira Masam, Margashira Masam 2022, Margasira Masam 2022 start date, Margasira masam Importance Telugu

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.