తిరుమల న్యూస్ Tirumala News


తిరుమల న్యూస్
జూన్ 11 నుంచి భ‌క్తుల‌కు అందుబాటులో జ్యేష్టాభిషేకం సేవా టికెట్లు

తిరుమలలో జూన్ 12 నుంచి 14వతేదీ వరకు మూడు రోజులపాటు జరుగనున్న జ్యేష్టాభిషేకం సేవా టికెట్లు జూన్ 11 నుంచి 13వ తేదీ వరకు తిరుమలలో కరంట్ బుకింగ్‌లో భక్తులకు అందుబాటులో ఉంటాయి.

రోజుకు 600 టికెట్ల చొప్పున విడుద‌ల చేస్తారు. ఒక్కో టికెట్ ధ‌ర రూ.400/-గా నిర్ణ‌యించారు. సిఆర్వో కార్యాల‌యానికి ఎదురుగా ఉన్న కౌంటర్‌లో భ‌క్తుల ఆధార్ వివరాలు, బయోమెట్రిక్ తీసుకుని టికెట్లు జారీ చేస్తారు. సేవ‌కు ఒక రోజు ముందుగా మొద‌ట వ‌చ్చిన వారికి మొదట అనే ప్రాతిపదికన టికెట్లు మంజూరు చేస్తారు. ఒక చిన్న లడ్డూ ప్రసాదంగా అంద‌జేస్తారు. సేవా టికెట్లు పొందిన భ‌క్తులు ఉద‌యం 8 గంట‌ల‌కు రిపోర్టు చేయాలి. ఆల‌యంలోని సంపంగి ప్రాకారంలో గ‌ల కల్యాణోత్సవ మండపంలో జ్యేష్టాభిషేకం జ‌రుగుతుంది. సేవ అనంత‌రం భ‌క్తుల‌ను మహా లఘుద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు.


టికెట్ల కేటాయింపు ఇలా జ‌రుగుతుంది…

– నిర్దేశించిన వివిధ ఆర్జిత సేవా టికెట్ల కోసం యాత్రికులు తిరుమలలోని కరంట్ బుకింగ్ కౌంటర్‌లో ఉదయం 11 నుండి సాయంత్రం 5 గంటల మధ్య నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

– రెండు అక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్‌లు వ‌స్తాయి. ఒక స్లిప్ యాత్రికునికి అందిస్తారు. ఇందులో వారి నమోదు సంఖ్య, సేవ‌ తేదీ, వ్యక్తి పేరు, మొబైల్ నంబర్ మొదలైనవి ఉంటాయి. మరొక స్లిప్ రెఫ‌రెన్స్ కోసం కౌంటర్ సిబ్బంది ఉంచుకుంటారు.

– నమోదు చేసుకున్న గృహస్తుల సమక్షంలో సాయంత్రం 6 గంట‌ల‌కు ఆటోమేటెడ్ రాండమైజ్డ్ నంబరింగ్ సిస్టమ్ ద్వారా ఎల్ఇడి స్క్రీన్ల‌లో మొద‌టి డిప్ తీస్తారు.

– సాధారణంగా, శుక్రవారం అడ్వాన్స్‌డ్ బుకింగ్ టికెట్లు కలిగి ఉన్న గృహస్తులు గురువారం రాత్రి 8 గంటలలోపు ఆర్జితం కార్యాలయంలో రిపోర్ట్ చేయాలి. అలా ఎవ‌రైనా చేయ‌ని ప‌క్షంలో ఆ టికెట్ల‌ను రాత్రి 8.30 గంటలకు రెండోసారి నిర్వహించే లక్కీడిప్ కోసం కరంట్ బుకింగ్‌కు మళ్లిస్తారు.

– ల‌క్కీడిప్‌లో టికెట్లు పొందిన గృహస్తులు వాటిని కొనుగోలు చేసేందుకు రాత్రి 11 గంట‌ల‌లోపు వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు ఎస్ఎంఎస్‌ ద్వారా స‌మాచారం తెలియ‌జేస్తారు. టికెట్లు పొంద‌ని వారికి కూడా ఎస్ఎంఎస్ ద్వారా తెలియ‌జేస్తారు.

– యాత్రికులు డిప్ విధానంలో అవకాశాన్ని పొందడం కోసం ఆటో ఎలిమినేషన్ ప్రక్రియ అమలవుతుంది.

– యాత్రికులు డిప్ విధానంలో ఏదైనా ఆర్జిత సేవ పొంది ఉన్న‌ట్ట‌యితే ఆరు నెల‌ల వ‌ర‌కు తిరిగి వారు ఆర్జిత సేవల‌ను పొందేందుకు అనుమతించబడరు. యాత్రికులు ఒక ఆర్జిత సేవకు మాత్రమే నమోదు చేసుకోవడానికి అనుమతి ఉంటుంది.
– సేవ‌ల‌ నమోదు కోసం ఆధార్ తప్పనిసరి. ఎన్ఆర్ఐలు అయితే పాస్‌పోర్ట్ చూపాల్సి ఉంటుంది. యాత్రికులు ఒరిజినల్ ఫొటో గుర్తింపుకార్డుతో స్వ‌యంగా హాజ‌రుకావాలి.

– కొత్తగా పెళ్లయిన జంటలకు నిర్ణీత కోటా ప్రకారం వివాహ కార్డు, లగ్న పత్రిక, ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డు స‌మ‌ర్పిస్తే కల్యాణోత్సవం టికెట్ల‌ కేటాయింపు జ‌రుగుతుంది. వివాహం జ‌రిగి 7 రోజులు మించ‌కుండా ఉండాలి. ముందుగా వచ్చిన వారికి ముందు అనే ప్రాతిప‌దిక‌న టికెట్లు కేటాయిస్తారు.

Comments

Post a Comment