Drop Down Menus

Karthika Puranam Day 1 in Telugu | కార్తీక పురాణము - 1వ అధ్యాయం | Hindu Temples Guide | Kartikapuranam Day wise PDF Download


కార్తీక పురాణము - 1వ అధ్యాయం

శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండమునందలి ఆర్యావర్తమందు నైమిశారణ్యములో శౌనకాది మహామునులతో నొక ఆశ్రమమును నిర్మించుకొని సకల పురాణములు, పుణ్య చరిత్రలు వారికి వినిపించుచూ సూతమహాముని కాలం గడుపుచుండెను. ఒకనాడు శౌనకాది మునులు గురుతుల్యుడగు సూతుని గాంచి, 'ఆర్యా ! తమ వలన అనేక పురాణేతిహాసములను, వేదవేదాంగ రహస్యములను సంగ్రహముగా గ్రహించినారము. కార్తీక మాస మహత్యమును కూడా వివరించి, దాని ఫలమును తెలుపగోరుచుంటిమి గాన తమరా వ్రతమును వివరించవలసినది అని కోరిరి.
అంత నా సూతమహర్షి, 'ఓ ముని పుంగవులారా ! ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీ దేవికి, సాంబశివుడు పార్వతీ దేవికీ తెలియజేసిన విధముగా నా గాధను వినిపించెను.
అట్టి పురాణ కథను మీకు తెలియజేయుదును. ఈ కథను వినుటవలన మానవులకు ధర్మార్ధములు కలుగటయే గాక, వారు యిహమందును, పరమందును, సకలైశ్వర్యములతో తులతూగుదురు. 

కావున శ్రద్ధగా నాలకింపుడని యిట్లు చెప్పెను.
పూర్వము ఒకానొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహరించుచుండగా పార్వతీ దేవి, 'ప్రాణేశ్వరా సకలైశ్వర్యములు కలుగజేయునట్టిది, సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది, శాస్త్ర సమ్మతమైనది, సూర్యచంద్రులున్నంత వరకు ఆచరింపబడేది యగు వ్రతమును వివరింపుడని కోరెను.
అంతట మహేశ్వరుడు మందహాస మొనరించి. 'దేవీ ! నీవు అడుగుచున్న వ్రతము స్కాందపురాణమున చెప్పబడియున్నది. దానినిప్పుడు వశిష్ట మహాముని మిథిలాధీశుడగు జనక మహారాజునకు వివరింపబోవుచున్నాడు. చూడుమా మిథిలా నగరము వైపూ, అని మిథిలా నగరపు దిశగా చూపించెను .
అట, మిథిలా నగరములో వశిష్టుని రాకకు జనకుడు సంతసించి అర్ఘ్యపాద్యములతో సత్కరించి, కాళ్ళు కడిగి, ఆ జలమును శిరస్సుపై జల్లుకొని 'మహాయోగీ! మునివర్యా ! తమ రాక వల్ల నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రులమైతిమి. తమ పాద ధూళీ చే నా గేహము పవిత్రమైనది. తమ రిటకేల వచ్చితిరో సెలవొసంగుడూ, అని వేడుకొనెను.
అందులకు వశిష్టుడు 'జనక మహారాజా! నేనొక మహాయజ్ఞుము చేయతలపెట్టితిని. దానికి కావలసిన అర్ధ బలమును, అంగ బలము నిన్నడిగి క్రతువు ప్రారంభించవలెనని నిశ్చయించి యిటువచ్చితినీ, అని పలుకగా, జనకుడు, 'ముని చంద్రమా!' అటులనే యిత్తును. స్వీకరింపుడు. కానీ. చిరకాలము నుండి నాకొక సందేహము కలదు. తమబోటి దైవజ్ఞులనడిగి సంశయమును తీర్చుకోదలిచితిని. నాయదౄష్టము కొలది ఈ అవకాశము దొరికినది. గురు రత్నా! సంవత్సరములో కల మాసములలో కార్తీక మాసమే ఏలనంత పవిత్రమైనది? ఆ కార్తీక మాస గొప్పతనమేమి? అను సంశయము నాకు చాలా కాలము నుండి యున్నది. కావున తాము కార్తీక మహత్మ్యము గురించి వివరింపవలసినదీ, అని ప్రార్థించెను.
వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి 'రాజా! తప్పక నీ సంశయమును తీర్చగలను. నే చెప్పబోయే వ్రత కథ సకల మానవులు ఆచరించదగినది. సకల పాపహరమైనది అయివున్నది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమునందాచరించు వ్రతము యొక్క ఫలమింతని చెప్పనలవి కాదు. వినుటకు గూడా ఆనందదాయకమైనది. అంతియే గాక వినినంత మాత్రమునే ఎట్టి నరక బాధలు లేక యిహమందును, పరమందును, సౌఖ్యమును పొందగలరు, నీబోటి సజ్జనులు యీ కథను అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకింపుమని యిట్లు చెప్పసాగెను.
వశిష్టుడు కార్తీక వ్రత విధానము తెలుపుట
ఓ మిథిలాధీశ్వరా! జనక మహారాజా! ఏ మానవుడైనను, ఏ వయసు వాడైనను, ఉచ్ఛ, నీఛ అనే భేదము లేక కార్తీక మాసములో, సూర్య భగవానుడు తులారాశియందుండగా, వేకువ జామున లేచి కాలకృత్యములను తీర్చుకొని, స్నానమాచరించి, దానధర్మములను, దేవతా పూజలను చేసినచో దాని వలన అగణిత పుణ్యఫలము లభించును. కార్తీక మాస ప్రారంభము నుండియు యిట్లు చేయుచూ, విష్ణుసహస్ర నామార్చన, శివలింగార్చన, ఆచరించుచుండవలెను. ముందుగా కార్తీక మాసమునకు ఆధిదేవతయగు దామోదరునికి నమస్కరించి, 'ఓ దామోదరా! నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానీయక నన్ను కాపాడుమ', అని ధ్యానించి, వ్రతమును ప్రారంభించవలెను.
కార్తీక స్నాన విధానము
'ఓ రాజా!' ఈ వ్రతమాచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి, కాలకృత్యములు తీర్చుకొని, నదికి బోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణునకు, పరమేశ్వరునకు, భైరవునకు, నమస్కరించి, సంకల్పము చెప్పుకొని, మరలా నీట మునిగి సూర్య భగవానునకు అర్ఘ్యప్రదాన మొసంగి, పితృదేవతలకు క్రమ ప్రకారముగా తర్పణములొనర్చి గట్టుపై మూడు దోసిళ్ళ నీళ్ళు పోయవలెను.
ఈ కార్తీక మాసములో పుణ్య నదులైన గంగ, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున, మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైననూ స్నానమాచరించిన యెడల గొప్ప ఫలము కలుగును. తడి బట్టలు వీడి, మడి బట్టలు కట్టుకొని, శ్రీమహావిష్ణువుకు ప్రీతి కరమైన పుష్పములను తానే కోసితెచ్చి నిత్య ధూప, దీప, నైవేద్యములతో భగవంతునికి పూజ చేసి, గంధము తీసి భగవంతునికి సమర్పించి, తాను బొట్టు పెట్టుకొని, పిమ్మట అతిధి అభ్యాగతులను పూజించి, వారికి ప్రసాదమిడి, తన ఇంటి వద్ద కానీ, దేవాలయములో కానీ, లేక రావిచెట్టు మొదట కానీ కూర్చుండి కార్తీక పురాణమును చదువవలయును. ఆ సాయంకాలము సంధ్యావందనము ఆచరించి. శివాలయమందు కానీ, విష్ణ్వాలయమందు కానీ, లేక తులసి తోట వద్ద కానీ, దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యమును తయారు చేయించి స్వామికి సమర్పించి, అందరికీ పంచిపెట్టి, తర్వాత తాను భుజింపవలెను. మరునాడు మృష్టాన్నముతో భూత తృప్తి చేయవలయును.
ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ, పురుషులకు పూర్వమందును, ప్రస్తుత జన్మమందును చేసిన పాపము పోయి మోక్షమునకు అర్హులగుదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశము లేని వారు, వ్రతము చేసిన వారలను జూచి, వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలము దక్కును.
ప్రథమాధ్యాయం మొదటి రోజు పారాయణము సమాప్తము.
కార్తీకపురాణం రెండవ రోజు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
click here : Karthika Puranam Day 2
credits: Sai Garu 


kartika puranam, katrika purana parayanam, kartika masam, karthika purana , karthika puranam, 1st day Kartika puranam. karthika puranam in telugu pdf, karthika puranam in telugu daily, 
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

ఎక్కువమంది చదివినవి

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.