Drop Down Menus

దృష్టిదోషం తగలకుండా ఉండాలంటే లాల్ కితాబ్ అనే గ్రంథంలో చెప్పిన చిరుచిట్కాలను కూడా పాటిద్దాం | Lal Kitab Drishti Remidies Telugu

దృష్టి దోషం

ఎందరో పెద్దలు, పూర్వులు దృష్టిదోష నివారణకు తమ అనుభవసారం నుంచి చెప్పిన కొన్ని సూచనలను పరిగణనలోకి తీసుకుంటూ లాల్ కితాబ్ అనే గ్రంథంలో చెప్పిన చిరుచిట్కాలను కూడా పాటిద్దాం.

నరుడి దృష్టిసోకితే నల్లరాయి కూడా పగులుతుందని సామెత . ఈ దృష్టిదోషం కేవలం మనుషులకే కాదు, గృహాలకు, వస్తువులకు, వాహనాలకు, దుకాణాలకు, వ్యాపారానికి, చివరికి కాపురానికి కూడా తగులుతుంది. మనదేశంలో శిశువులకు అనారోగ్యం కలిగితే ఇంటి చిట్కాలు పాటిస్తారు. అప్పటికీ పిల్లలు చికాకు పడుతుంటే దిష్టితీస్తారు. ‘ఇరుగు దిష్టి పొరుగు దిష్టి, తల్లి దిష్టి, ఇంట్లో వాళ్ల దిష్టి, ఊళ్లో వాళ్ల దిష్టి...’ అని చివరగా మనకు ఫలానా వారి దృష్టి తగిలిందని అనుమానంగా ఉన్న వారి పేరు తలుచుకుని ఉప్పు తీస్తారు. 

దృష్టిదోషం పిల్లలకే కాదు, పెద్దవారికి కూడా తగులుతుంది. అప్పుడు వారు పనిపట్ల శ్రద్ధ చూపలేరు. ఏవేవో విషయాల గురించి ఆలోచిస్తారు. వింతగా ప్రవర్తిసారు. విద్యార్థులకైతే చదువు మీద శ్రద్ధ తగ్గిపోతుంది. వాహనాలకు దృష్టిదోషం తగిలితే ప్రమాదాలకు గురవుతాయి. భోజనం చేసేటప్పుడు ఎవరైనా తదేకంగా చూస్తే వారి ఆకలి తగ్గిపోతుంది. తిన్నది ఒంటబట్టదు. అజీర్తి కలుగుతుంది. అందుకే ఎప్పుడైనా ఎవరి గురించైనా మెచ్చుకునేటప్పుడు దేవుని కూడా కలుపుకుంటూ ఉండాలి. ఉదాహరణకు దేవుడి దయవల్ల మీ బాబు లేదా పాప చాలా ముద్దుగా ఉన్నారనో లేదా భగవంతుడి దయవల్ల మీకు చక్కటి ఇల్లు లేదా వాహనం అమరిందనో అనడం వల్ల అందులోని కీడు భగవంతునికే పోతుంది. భగవంతుడు కూడా దృష్టి దోషం నుంచి తప్పించుకోలేడు. అది తొలగించేందుకే ఆలయంలో పూజారులు హారతులివ్వడం, గుమ్మడికాయలు పగులగొట్టడం, నివేదన చేసేముందు తెరను అడ్డుగా ఉంచడం వంటివి చేస్తుంటారు.

దృష్టిదోషం తగలకుండా ఉండాలంటే...

ప్రతిరోజూ నిద్రలేవగానే పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి. దానివల్లఆ రోజంతా దృష్టిదోషం పడకుండా ఉంటుంది. ఒకవేళ ప్రతిరోజూ ఆ విధంగా చెయ్యడం కుదరకపోతే కనీసం మంచి దుస్తులు ధరించినప్పుడు లేదా ప్రత్యేకంగా అలంకరించుకున్నప్పుడు ఆలయానికి వెళ్లి అర్చకుని ఆశీస్సులు తీసుకోవడం శుభప్రదం.

భోజనం చేసేటప్పుడు హఠాత్తుగా ఎవరైనా వస్తే వారిని కూడా భోజనానికి కూర్చోమని చెప్పాలి. లేదా వారికి కనీసం ఏదైనా పండో, పానీయమో ఇవ్వాలి.

మన సంప్రదాయం ప్రకారం విస్తరిలో లేదా పళ్లెంలో భోజనం వడ్డించుకున్న తర్వాత మొదటి ముద్ద తీసి కాకికి వే యడం లేదా భగవంతుని తల్చుకుని కన్నులకు అద్దుకుని తినడం... దృష్టి దోష నివారణకోసమే. మనం కూడా ఆ పద్ధతిని పాటించడం మంచిది.

దృష్టి తగిలితే...?

పిల్లలు నిద్రలో ఉలిక్కి పడి ఏడుస్తూ ఉంటే గుప్పెడు ఎండుమిరపకాయలను వారి తలపైనుంచి మూడుసార్లు దిగదుడిచి నిప్పుల్లో పడేస్తే ఆ దోషం నశించి, వారు హాయిగా నిద్రపోతారు. కర్పూరం బిళ్లను వారి చుట్టూ తిప్పి దానిని వెలిగించినా దుష్ర్పభావం తొలగిపోతుంది. పిల్లలకు బుగ్గన చుక్క పెట్టడం, నుదుటన అగరుతో బొట్టు పెట్టడం, మొలతాడు కట్టడం, మెడలో ఆంజనేయస్వామి లేదా ఇతర దేవతా మూర్తుల ప్రతిమలను కట్టడం చెడు దృష్టి సోకకుండా ఉండడానికే!

కొత్తదుస్తులు ధరించబోయే ముందు అందులోంచి ఒక దారం పోగు తీసి నిప్పులో పడేయాలి లేదా ఆ వస్త్రం మూల కాటుకతో చుక్క పెట్టాలి.

పసిపిల్లలు అకారణంగా గుక్క పట్టి ఏడుస్తుంటే పాలు లేదా వారు తినే ఆహార పదార్థాన్ని ఏడుమార్లు దిగదుడిచి దానిని కుక్కకు లేదా ఆవుకు తినిపించాలి.

అపరిచితులతో లేదా పరిచయస్తులతో ఎవరితోనైనా సరే, తమ గురించి గొప్పలు చెప్పుకోకూడదు. బంధుమిత్రులతో తమ వైభవాన్ని గురించి తరచు ప్రశంసించుకోకూడదు.

ఆంజనేయస్వామిని ఉపాసించడం, ఈశ్వరారాధన లేదా వీరభద్రుడు, కాలభైరవుడు, దుర్గ, కాళి, గౌరి తదితర దేవతలను ఆరాధించడం వల్ల దృష్టిదోషం నుంచి తప్పించుకోవచ్చు.

సంధ్యాసమయంలో దీపం పెట్టడం, అగరుబత్తులు వెలిగించడం సాంబ్రాణి ధూపం వేయడం వల్ల దృష్టిదోష నివారణ జరుగుతుంది.

కుటుంబసభ్యులు ఎవరైనా పరధ్యానంగా ఉండటం, చికాకు పడటం, అనవసరంగా ఏడవటం లేదా నవ్వటం, దేనిమీదా దృష్టి నిలపలేకపోవడం వంటి లక్ష ణాలు కనిపిస్తే వారికి దృష్టి దోషం తగిలినట్లుగా భావించవచ్చు. అది తొలగేందుకు వారిచేత ఆంజనేయస్వామి గుడిచుట్టూ 11 రోజులపాటు ప్రదక్షిణలు చేయించాలి. ఇంటిలో సుందరకాండ పారాయణ చేయాలి లేదా చేయించాలి లేదా ఒక మంగళవారం నాడు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి స్వామి వారి భుజస్కంధాల మీద ఉన్న సిందూరాన్ని తెచ్చి దృష్టిదోషం తగిలిన వారికి తిలకంగా పెడితే చెడు దృష్టి ప్రభావం తొలగి పోతుంది.

మనమే కాదు, పక్కవారు కూడా సుఖంగా ఉండాలని కోరుకోవడం వల్ల సత్ఫలితా లెన్నో సిద్ధిస్తాయి. అవతలివారు చెడిపోవాలని కోరుకోవడం వల్ల వారితోపాటు మనకు కూడా ఎన్నో కష్టాలు చుట్టుకుంటాయి. కాబట్టి సర్వేజనాస్సుఖినోభవంతు అని కోరుకుందాం.

దిష్టి కంటి చూపు వల్ల వస్తుంది. అది ప్రేమాభిమానాలతో కావచ్చు. ఈర్షాద్వేషాల వల్ల కావచ్చు. అందుకే చివర్లో కొద్దిగా అన్నం ఉంచి బిడ్డకు దిష్టి తీసేయడం సంప్రదాయం గా వస్తోంది. దిష్టి తగితే పశువులు కూడా పాలు ఇవ్వవు. పెళ్లి జరిగాక కొత్తజంట ఇంట్లోకి అడుగు పెట్టేప్పుడు ఎర్రరంగు నీటితో దిష్టి తీయడం సంప్రదాయంగా వస్తోంది. పెళ్లికి వచ్చిన అందరి దృష్టీ వధూవరులపైనే పడుతుంది. కాబట్టి దిష్టి తగల కుండా ఎర్ర నీళ్లతో దిష్టి తీస్తారు. ఉప్పు, ఎండుమిర్చి కలిపి ఎవరికైనా దిష్టి తీశాక వాటిని నిప్పుల్లో వేస్తే మిరపఘాటు ఉండకపోవడమే దిష్టి ఉందనడానికి నిదర్శనం.

జ్వరమూ, నీరసమూ, దగ్గు ఉన్నప్పుడు

దిష్టితియ్యగానే ఒకింత ఉపశమనం కలుగు తుంది. ఎందుకని? నిప్పులు పళ్ళెంలోపోసి ముఖానికి దగ్గరగా పెట్టి మూడుసార్లు మిరపకాయలతో, ఉప్పుతో దిష్టి తీసి నిప్పులమీద వేస్తారు. అలా వేసిన తర్వాత వచ్చే పొగను పీల్చటం వల్ల..

అనగా సోడియం క్లోరైడ్ విడిపోయి సోడి యం పెరాక్సైడ్ గా, క్లోరిన్ గా మారిన వాటిని , పీల్చటం వల్ల ముక్కురంధ్రాల గుండా తీక్షణ మయిన ఆ వాయువు శరీరంలో ప్రవేశించటంతో శ్వాసమండలం రిలాక్స్ అవుతుంది.

దానితో ఏదో తెలియని శాంతి కలుగు తుంది. పెద్దలు పెట్టిన ఏ ఆచారంలో నైనా, సాంప్రదాయంలోనైనా ఎంతో జ్ఞానం ఉంది. అలానే దీనికి ప్రాధాన్యం ఉంది.

దృష్టి దోషము పిల్లలకు

దృష్టి దోషం కలుగకుండా కలిగిన దృష్టి దోషం పోవుటకు విభూతి చేతిలో పట్టుకొని ఈక్రింది శ్లోకములు చదివి ధారణ చేయించాలి.

వాసుదేవో జగన్నాథ: పూతనా తర్జనో హరి:

రక్షతు త్వరితో బాలం ముంచ ముంచ కుమారకం

కృష్ణ రక్ష శిశుం శంఖ మధుకైటభ మర్ధన

ప్రాతస్సంగవ మధ్యాహ్న సాయా ప్నేషు చ సంధయ్యో

మహానిః సదా రక్ష కంసారిష్ట నిషూదన,

యద్ధీరజ: పిశాచాంశ్చ గ్రహాన్ మాతృగ్రహానపి

బాలాగ్రహాన్విశేషేణ ఛింది ఛింది మహా భయాన్

త్రాహి త్రాహి హరేనిత్యం త్వద్రక్షా భూషితం శుభం ".

Famous Posts:

Tags: నర దిష్టి, నరఘోష, Nara Drishti, Nara Drishti Nivarana, Disti Remidies Telugu, Lal kitab Remidies Telugu

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON