Drop Down Menus

తారకాసురవధలో యుద్ధకళ గురించి దయచేసి అందరూ పూర్తిగా చదవండి | Story of Tarakasura | Hindu Temple Guide

తారకాసురవధలో యుద్ధకళ గురించి దయచేసి అందరూ పూర్తిగా చదవండి ..

కుమారస్వామి జన్మించినదే తారకాసురాది మహారాక్షససంహారానికి. కనుక ఆయనకు దేవసైన్యాధ్యక్షాభిషేకం చేశారు. సకల దేవతలు, మునిగణాలు, దేవతీర్థక్షేత్రాలు, నదులు, యక్షగంధర్వాదులు వచ్చి సరికొత్త శక్తులతో సైన్యాన్ని మహాయోధులతో అప్పటి వరకూ లేని దివ్యశక్తులతో సమకూర్చారు.

కార్తికేయుని రక్షగా విష్ణుమూర్తి కవచాన్ని ఒక స్వస్త్యయనం రూపంలో ప్రసాదించాడు. ( ఇది బహుదుష్కరమైన యుద్ధకార్యాలకు వెళ్ళేవారికి జయం కోరి వెళ్ళేవారికి పరమ శుభాలు కలిగించే స్తోత్రం. పరమ పవిత్రమైన ఈ స్తోత్రాన్ని సామాజిక మాధ్యమంలో ఇవ్వడంలేదు.

Also Read : చాలామందికి  తెలియని గాయత్రీ మంత్రం రహస్యం

అనంతరం కుమారస్వామి తన సేనలతో మాతృగణాలతో కలసి పక్షిరాజు గరుత్మంతుడు ఇచ్చిన నెమలి వాహనం అధిరోహించి గగనమార్గంలో యుద్ధానికి పయనం అయ్యాడు.

ఆయనతో పాటు దేవగణాలు  కూడా వివిధ పక్షుల ఆకారాలు ధరించి అనుసరించాయి. చాలా దూరం వెళ్ళాక తనతో వస్తున్న సేనలను క్రిందికి భూమి మీదకు దిగమని ఆజ్ఞాపించాడు కుమారస్వామి. 

అలా నేలకు చేరుతున్న దేవగణాలు దిక్కులు పిక్కటిల్లేలా మహాధ్వని చేశాయి. ఆ ధ్వని పాతాళంలోని రాక్షసులకు చేరింది. దీనిని విన్న తారకుడు ఆ కదనరంగ ధ్వని ఎక్కడిది అని వివరాలు అడిగాడు.

ఇక్కడ నుంచీ ప్రాచీన యుద్ధకళ పురాణాలలో ఎలా నమోదు అయిందో గమనించవచ్చు.

ప్రతీ యుద్ధానికి ముందు సన్నద్ధం కావడం ఉంటుంది. దాని తరువాత ఒక్కొక్క అడుగూ ముందుకుపడుతుంది.

ఇక్కడ రాక్షసులతో యుద్ధం చేయడానికి కుమారసంభవం, దేవసైన్యసమీకరణ పూర్తి అయింది. దేవసైన్యాధ్యక్షుడుగా అభిషేకం జరిగింది.

ఇప్పుడు కుమారస్వామి గగన విన్యాసం చేశాడన్నమాట. తొలుత తన శక్తి సామర్ధ్యాలు ప్రదర్శించమే మయూర వాహనం ఎక్కి తన దివ్యసైనిక శక్తులతో ఆకాశంలో సుదూరం ఎగరడం. ఇలా చేయడం  శత్రువులను తొడగొట్టి రెచ్చగొట్టడం వంటిది. 

నేటికీ అధునాతన యుద్ధప్రారంభాలలో ఈ విధంగా యుద్ధవిమానాలతో శత్రుభూముల మీద విన్యాసాలు చేస్తారు. ఇలా చేస్తూనే అనేక సమాచారాలు సేకరిస్తారు. ముఖ్యంగా యుద్ధక్షేత్రాన్ని నిర్ణయించుకుంటారు.

దాని తరువాత భూమి మీద సైనిక స్థావరాన్ని ఏర్పరచుకుంటారు. అదే కుమారస్వామి చేశాడు. 

దీని తరువాత తాను యుద్ధానికి సిద్ధంగా ఉన్నాను అనే సంకేతం శత్రువుకు పంపుతారు. అదే దేవగణాలు సింహనాదం చేయడం అంటే.

యుద్ధానికి వెళ్ళిన ప్రతీ సైన్యం కొంతకాలం స్థావరాల్లో సకల ఏర్పాట్లు చేసుకున్నా, యుద్ధం ప్రారంభం కావడానికి కొంత సమయం తమ కందకాలలో వేచి ఉండాల్సి వస్తుంది. ఇది శత్రువు యుద్ధానికి వచ్చే సమయం అన్నమాట. ఇది యుద్ధ వ్యూహాన్ని బట్టీ ఉంటుంది. అంటే అమెరికా తన సైన్యాన్ని పాకిస్తాన్ లో మోహరించడం వంటిది.

సరిగ్గా ఇదే జరిగింది. దేవగణాలు చేసిన యుద్ధనాదాన్ని అందుకున్న రాక్షసులు తమకు వచ్చిన యుద్ధ ఆహ్వానం బహిరంగంగా అందుకున్నారు. తన సైనిక ప్రముఖులతో చర్చలు జరపి వ్యూహరచనలో తారకాసురుడు మునిగాడు.

ఇక్కడ అతి ముఖ్యమైన అంశం దాగి ఉంది.

ప్రతీ యుద్ధం వెనుకా ఆ యుద్ధం ఎందుకు చేస్తున్నామో ఆ కారణం బహిరంగంగా చెప్పవలసి ఉంటుంది. 

నేటికీ అధునాతన యుద్ధాలలో కూడా ఇది తప్పని సరి. 

అమెరికా వంటి దేశం తమ ట్విన్ టవర్లు బిన్ లాడెన్ కూల గొట్టాడు అనే కారణం చూపి ఆఫ్ఘనిస్థాన్ యుద్ధం చేసింది. అయితే ఇక్కడే అది చతికిల పడింది.

 జంటభవనాలు కూల గొట్టింది ఎవరు అంటే చెడ్డీవేసుకోవడం రాని పిల్లాడు కూడా లాడెన్ అని చెబుతాడు. కానీ చెడ్డీ పిల్లలు చెప్పేది కాదు అంతర్జాతీయ యుద్ధాలలో దేశాలు చూపాల్సిన కారణం. వారు ఒక కోర్టులో ఒక కేసును ఎంత బలంగా సాక్ష్యాధారాలతో దాఖలు చేస్తారో అంతపకడ్బందీగా కారణాలు అంతర్జాతీయ సమాజానికి చూపగలగాలి.

Also Readకాకికి అన్నం ఎందుకు పెట్టడం ?

అమెరికా ఇక్కడే పప్పులో కాలేసింది. లాడెన్ చాలా తెలివిగా జంటభవనాలను తానే కూలగొట్టాను అనే మాట ఎక్కడా అనలేదు సరికదా, తానే కూలగొట్టానని అమెరికాను నిరూపించమని బహిరంగ సవాల్ చేశాడు. దీంతో అమెరికా కుడితిలో పడ్డ ఎలుకలా కొట్టాడింది. అన్నీ యుద్ధానికి సిద్ధం చేసుకున్నా తగిన కారణం చూపలేని అసమర్థత వల్ల చాలాకాలం ఆగాల్సి వచ్చింది. అయితే ప్రపంచాన్ని తన కౌబాయ్ క్రౌర్యంతో అణచివేయడం తెలిసిన దేశం కనుక ఒక పది తెల్లకాగితాలు పట్టుకుని తన దేశ ప్రతినిధికి ఇచ్చి ప్రపంచంలోని అన్ని అగ్రదేశాలకు ఒక ప్రత్యేక విమానం ద్వారా పంపింది. ఆ తెల్లకాగితాలలో ఏ చిదంబర రహస్యం ఉందో నేటి వరకూ ఎవరికీ తెలియదు. అమెరికా పౌరులు ఎన్ని నేప్ కిన్లు వాడతారు, టాయిలెట్ పేపర్ ఏడాదికి ఎన్ని క్వింటాళ్ళు ఖర్చుచేస్తారో చెప్పే అమెరికా బిన్ లాడెన్ ను దోషిగా నిరూపించే సాక్ష్యాలు మాత్రం యుద్ధకాలంలో చూపలేకపోయింది.

అమెరికా యుద్ధనీతుల్లో నేటికీ ఆఫ్ఘనిస్థాన్ యుద్ధ సమయంలో ప్రపంచానికి లాడెన్ సవాల్ కు సమాధానం చెప్పని అంశం ఒక చెరపలేని మచ్చగా మిగిలిపోయింది.

వామన పురాణం కూడా అత్యత్భుతంగా ఈ కారణం చూపే అంశాన్ని పేర్కొనడం జరిగింది. కుమారస్వామి అప్పుడే పుట్టాడు. అతనికి రాక్షసులకు ఏ వైరం లేదు. కనుక ఏ కారణం చూసి అతనితో యుద్ధం చేస్తారు? మహారాక్షసులైనా వారు కారణం కోసం ఆగారు.

అటువంటి కారణం వారికి  పాతాళకేతువు ద్వారా దొరికింది.

పాతాళకేతువు అనే రాక్షసుడికి భూలోకంలో మహర్షులు చేసే యాగాలు పాడుచేయడమే పని. గాలవాశ్రమానికి వెళ్ళి అక్కడ యజ్ఞాలు నాశనం చేయడం ప్రారంభించాడు. వాడిని వెంబడించి ఒక వీరుడు బాణాలతో ఒళ్ళు చీల్చడం ప్రారంభించాడు. ఆ బలశాలి నుంచీ తప్పించుకు పోతూ దక్షిణసముద్రం చేరాడు. అక్కడ మహాసైన్యం ఉంది. ఆ సైన్యం ‘‘తారకాసురుడిని చంపుతాము, మహిషాసురుని చంపుతాము‘‘ అని గర్జిస్తూ ఉండడం విన్నాడు. వీరుడు తరుముకు వస్తూ ఉండగా తారకుడిని చేరి ఈ సమాచారం చెప్పి శరణు కోరాడు.

తారకుడు భయపడవద్దని అభయం ఇచ్చి  ఈ కారణం చూపి సమరం ప్రకటించాడు.

రాక్షస సైన్యాలు సమాయత్తం చేసి యుద్ధానికి అంధకాసురుడు, మహిషాసురుడు, కుంభుడు, బాణుడు, జంభాసురుడు వంటి మహారాక్షసులతో కలసి దేవగణాలతో యుద్ధనికి వెళ్ళాడు.

దీని తరువాత యుద్ధకళలో ముందుగా ఎవరు ఫస్ట్ బులెట్ పేల్చారు అన్నది ముఖ్యం.

భూమండలంలో దక్షిణసముద్రం దగ్గర వేచి ఉన్న కుమారస్వామి ఆధిపత్యంలోని దేవ సైన్యాన్ని, పాతాళం నుంచీ వచ్చిన రాక్షససైన్యం చేరుకొంది. వస్తున్న సైన్యాన్ని చూసి దేవసైన్యం ఎదురు వెళ్ళింది. కుమారస్వామి పరిఘపట్టి రాక్షసులను చంపడం మొదలు పెట్టాడు.

ఇక్కడ మరో రహస్యమైన అంశం పురాణవిద్య అభ్యసించేవారు తెలుసుకోవాలి.

దేవసైన్యరహస్యాలు ఎలా రహస్యంగా వామనపురాణంలో విచిత్రమైన పేర్లతో దాచి ఉంచారనే అంశం తెలుసుకున్నాము. కుమారస్వామి సైన్యంలో దేవతలు ఇచ్చిన దివ్యశక్తుల యోధుల పేర్లు చెప్పిన పులస్త్యుడు, యుద్ధవర్ణనలో ఈ వీరుల రహస్య శక్తులు చెప్పాడు. వాటిని సూచనా ప్రాయంగా మాత్రమే చెబుతూ వచ్చాడు. అంతేకాకుండా వారు కూడా మామూలు యోధుల్లా యుద్ధం చేశారు అని చెప్పడంతో అధికశాతం పౌరాణికులు ఈ రహస్యాలు కనుగొనలేకపోయారు.

ఉదాహరణకు జ్వాలాముఖుడు అనే దేవసైనికుడు అందిన ప్రతీ దానవుడినీ తన నోట్లో వేసుకున్నాడని వర్ణించాడు. జ్వాలా ముఖుడు అంటే భయంకరమైన అగ్ని ప్రయోగం చేసేవాడన్నమాట. తన నోట్లో వేసుకోవడం అంటే మంటల్లో మండిచాడన్నమాట.

దండకుడు అంటే బానెట్ ఫైట్ చేసేవాడు. ఈ దేవసైనికుడు ప్రతీ దానవుడినీ చీల్చి సముద్రంలోకి విసిరేశాడని వర్ణించాడు.

సహస్రనయనుడు అనే వేయి కన్నుల దేవసైనికుడు శూలంతో అశ్వరథకుంజరసహితంగా దానవులను మట్టుపెట్టడం ప్రారంభించాడు.

షోడశాక్షుడు అనే 16 కన్నుల దేవసైనికుడు, శతశీర్షుడు అనే వందతలకాయల మేటి ఖడ్గధారి, శ్రుతాయుధుడు అనే ధ్వనితరంగాలను వినే నిష్ణాతుడు - వీరంతా వీరవిజృభణంగా యుద్ధం చేశారు.

అయితే మహిషాసురుడు వీరిని అడ్డుకోవడానికి భీకరమైన యుద్ధం చేశాడు.

ఇవన్నీ ఇలా ఉండగా సుచక్రాక్షుని యుద్ధవర్ణన అతి ముఖ్యమైంది. 

ఇక్కడ గమనించాల్సిన ముఖ్యఅంశం ఒకటి ఉంది. ప్రతీరంగంలోనూ లైన్ అండ్ స్టాఫ్ డ్యూటీలు ఉంటాయి. వీరి గురించి అర్థం చేసుకోవడం చాలా సులభం. యుద్ధం చేసేవారు కొందరు ఉంటే, యుద్ధం చేసేవారికి సాయకులుగా కొందరు ఉంటారు. సాయకుల పని ప్రధానంగా యుద్ధం చేసే సైనికులకు సహాయం చేయడమే. అలా అని వారు యుద్ధం చేయలేని వారు అని కాదు అర్థం.  అవసరమైతే, చేయాల్సిన తమ విధులు లేకపోతే, తీరికగా ఉంటే వారుకూడా యుద్ధం చేస్తారు.

అటువంటి వాడే సుచక్రాక్షుడు. ఇతడు చక్రముల వంటి కళ్ళు కలవాడు. అంటే 360 డిగ్రీలలో కదనరంగాన్ని చూస్తూ ఎక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోగలిగిన వాడు. కనుకనే ఆయన మహిషాసురుడు రెచ్చి పోవడం గమనించి స్వయంగా ఆయనే యుద్ధానికి వెళ్ళాడు.

సుచక్రాక్షుడిని మహిషాసురుడు ఎదుర్కోలేకపోయాడు.

దీంతో కపట యుద్ధం మొదలు దానవులు పెట్టారు.

ఎవరు పుట్టించారో చెప్పలేదు కానీ రాక్షససైన్యంలో ‘‘మహిషుడు చనిపోయాడు‘‘ అనే పుకారు పుట్టించారు.

ఇది అప్పటి యుద్ధరంగాల్లోని ఆన్ లైన్, రియల్ టైం సమాచార వ్యవస్థలను తెలుపుతుంది.

ఈ పుకారుని విని బాణుడు అనే వెయ్యిచేతుల రాక్షసుడు మహిషుడి దగ్గరకు పరిగెత్తుకు వచ్చి సుచక్రాక్షుడు కదల కుండా తన ఐదు వందల చేతులతో బంధించాడు. మరో ఐదువందల చేతులతో మహిషుడిని రక్షించడం ప్రారంభించాడు.

దీన్ని మకరాక్షుడు అనే మరో దేవ సైనికుడు చూశాడు. ఇంతకు ముందే మకరాక్షుని దివ్య శక్తి గురించి తెలుసుకున్నాం. మొసలి కళ్ళకున్న దివ్యశక్తులు తెలుసుకున్నాం. ఇటువంటి దివ్యదృష్టి కలవాడు కనుక వెంటనే రియల్ టైం రెస్క్యూ ఆపరేషన్ కు వచ్చాడు.

Also Readసాంబ్రాణి ధూపం వేయడం వల్ల కలిగే లాభాలు?

వెయ్యి చేతుల బాణుడు చేతులు ఖాళీ లేకుండా యుద్ధం చేయడం చూసి తేలిగ్గానే అతడి నెత్తిమీద బలంగా తన గదతో బాదాడు. బాణుడు భయంకరమైన వేదనతో చక్రాక్షుడిని వదిలిపెట్టాడు.

ఈ లోపల తారకాసురుడిని చంపివేసిన కుమారస్వామి మహిషాసురిడి వెంటపడ్డాడు. తారకుడు చనిపోవడం చూసి కుమారస్వామి శక్తి తెలిసి మహిషుడు పారిపోవడం ప్రారంభించాడు. శరవణుడు వాడిని వెంటతరుముతుండగా క్రౌంచపర్వతంలోని గుహలో దూరాడు.

ఇది చూసిన కార్తికేయుడికి ధర్మసందేహం వచ్చి గుహకు అడ్డంగా కూర్చుని వాడు బయటకు వస్తే చంపుదామని తన సందేహానికి సమాధానం వెతకసాగాడు.

క్రౌంచపర్వతం సునాభుని పుత్రుడు. సునాభువు హిమవంతుడి పుత్రుడు. హిమవంతుడు శివుడికి పిల్లనిచ్చిన మామగారు. అంటే పార్వతీదేవికి తండ్రి. అంటే సునాభుడు పార్వతి తమ్ముడు. అంటే క్రౌంచపర్వతం గౌరీదేవికి మేనల్లుడు. అంటే తన తల్లికి మేనల్లుడు కనుక తనకు బంధువు, రక్తసంబంధీకుడు. 

ఈ రాక్షసుడు పోయి ఈ పర్వతం గుహలో దాక్కున్నాడు. వాడ్ని చంపాలంటే పర్వతాన్ని పేల్చాలి. అలా పేల్చితే బంధునాశం చేసిన వాడు అవుతాడు. కనుక ఏం చేయాలా అనే సందేహంలో కుమారస్వామి పడ్డాడు.

ఇలా ఆలోచిస్తూ గుహముఖంలో కూర్చున్న గుహుడిని వెనకాలే వచ్చిన ఇంద్రుడు చూశాడు.

ఏంటి చూస్తున్నావ్ పర్వతాన్ని పేల్చేసి వాడ్ని చంపేయి అన్నాడు.

బంధుహత్య చేయనన్నాడు కుమారస్వామి.

దాంతో ఇంద్రుడు తన మాయోపాయాలు పన్నాడు.

కుమారస్వామిని రెచ్చగొట్టడం ప్రారంభించాడు.

Also Readమీ పుట్టిన తేది ప్రకారం ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంచితే శుభం 

కలుగులో ని  ఎలుకలా దొరికిపోయిన మహిషుడిని నిజానికి ఇంద్రుడు కొండగుహను పేల్చేసి చంపగలడు. కానీ అలా చంపితే శివుడు, పార్వతులకు ఏం కోపం వచ్చి శపిస్తారో అనే భయం ఉండనే ఉంది. అందులోనూ కుమారస్వామి తనకు పోటీ అనే భయం ఉండనే ఉంది. అందులోనూ మొన్ననే శివుడి మహామోహం అడ్డుకొని సొంతభార్యలకు పుత్రులు జన్మించే అవకాశం లేని శాపం పొందాడు. కుటిల రాజనీతిలో సిద్ధహస్తుడు కనుక తాను క్రౌంచపర్వతాన్ని నష్టపరచకుండా కుమారస్వామితో చేయించాలని ఎత్తు వేశాడు.

కనుకనే కుమారస్వామిని రెచ్చగొట్టడం ప్రారంభించాడు.

‘‘శక్త్యాయుధంతో కొండబ్రద్దలు కొట్టి రాక్షసుడిని చంపు, ఆలోచిస్తున్నావేంటి?‘‘ అన్నాడు.

‘‘మా అమ్మ తండ్రి మనుమడిని ఎలా చంపను? అమ్మకు మేనల్లుడు, నాకు సోదరుని వంటి వాడు. నీకు తెలీదా పురాతన వేదవాక్కు. గోవు, బ్రాహ్మణుడు, వృద్ధుడు, బాలుడు, బంధువు, దుష్టురాలుకాని ఆడది, గురువులు, గురుజనులు -వీరు అపరాధం చేసినా చంపరాదు. కనుక నేను క్రౌంచాన్ని భేదించను మహిషుడు లోపల ఎన్నాళ్ళు ఉంటాడు. బయటకు వచ్చాక చంపుతాను‘‘ అని కుమారస్వామి అన్నాడు.

కుమారస్వామి మాటలు విన్న ఇంద్రుడు తనలోతాను దుష్టపన్నాగాలు పన్నుకొని ‘‘నువ్వు నాకంటే తెలివైనవాడివిలా మాట్లాడుతున్నావు. విష్ణువు చెప్పిన మాట నీకు తెలీదా? ఒకడి కోసం పదిమందిని చంపకూడదు. పది మందికోసం ఒకడిని చంపవచ్చు అని చెప్పాడు తెలుసా? నేను సొంత తమ్ముడు నముచిని చంపాను (మరుత్తులజన్మవృత్తాంతంలో వస్తుంది). కనుక తప్పేమీ లేదు కొండబద్దల కొట్టు‘‘ అని రెచ్చగొట్టాడు.

కుమారస్వామి ఆ పని చేస్తే హిమవంతుడు, పార్వతులతో విరోధం వస్తుంది కనుక తన చేతికి రక్తం  అంటకుండా తనకు శాపం ఇచ్చిన అటు పార్వతిని, తనకు పోటీ అయిన కుమార స్వామిని దెబ్బకొట్టాలని దుష్టపాచికవేశాడు.

కుమారస్వామికి తనను ధిక్కరిస్తూ ఇంద్రుడు మాట్లాడే సరికి మహాకోపం వచ్చింది.

ఇంద్రుడు దేవతాధిపతి. ముల్లోకాధిపతి. కుమారస్వామి దేవసైన్యాధ్యక్షుడు. వీరిద్దరికీ లడాయి పడిందిక్కడ. తనకన్నా శక్తిమంతుడైన సైన్యాధిపతిని రాజు నియంత్రించుకోలేకపోతే తన గొయ్యి తానే తవ్వుకున్నవాడవుతాడు. కనుక ఇంద్రుడు తన ప్రాణాలు అడ్డువేసి మరీ ఈ కుటిల యుద్ధానికి దిగాడు. తన ఎత్తు పారిందా? కార్తికేయుడికి అపకీర్తి వస్తుంది, ఎదురులేని సింహాసనం వస్తుంది. పారలేదా తనకు వచ్చిన నష్టం ఏం లేదు. ఇది ఇంద్రుడి ఎత్తుగడ.

దేవరాజు మీద కోపం వచ్చిన దేవసేనాపతి తిరుగుబాటు చేసి యుద్ధానికి రా అని సవాల్ చేశాడు.

ఇంద్రుడికి తాను కుమారస్వామిని గెలవలేనని తెలుసుకనుక, ‘‘యుద్ధం ఎందుకులే ఇద్దరం కలసి ఒకపందెం వేసుకుందాం. ఈ క్రౌంచపర్వతాన్ని ఎవరు ముందుగా చుట్టవస్తే వారు గెలిచినట్టు‘‘ అని అన్నాడు.

కుమారస్వామి పర్వతాన్ని చుట్టి వచ్చి నేను గెలిచాను అన్నాడు.

ఇంద్రుడు ‘‘కాదు నేనే గెలిచాను నేనే ముందువచ్చాను‘‘ అన్నాడు.

మళ్ళీ జగడం మొదలైంది.

ఈ సారి మరింత విషం లాంటి ఆలోచన చేసిన ఇంద్రుడు ‘‘ఎవరు ముందు వచ్చాడో క్రౌంచాన్నే అడిగి తెలుసుకుందాం‘‘ అన్నాడు.

ఇంద్రుడి దుష్టబుద్ధి అంతా ఈ మాటల్లో ఉంది. నిజానికి క్రౌంచం, కుమారస్వాములు చిన్నపిల్లలు. వారికి వేదవేదాంగాలు తెలిసిన మహాశక్తిమంతులే అయినా ఈ కపటాలు తెలియవు.

కుమారస్వామి ‘‘ ఎవరు ముందు వచ్చారు?‘‘ అని క్రౌంచాన్ని అడిగాడు.

ఈ సమయంలో క్రౌంచం నిజానికి మౌనంగా ఉండి ఉంటే కథ వేరుగా ఉండేది. కానీ పిల్లవాడు కావడం వల్ల, ఇంద్రుడి దుష్టత్వం తెలియదు కనుక ‘‘ఇంద్రుడే ముందు వచ్చాడు‘‘అనేశాడు.

Also Readఈ స్తోత్రం ప్రతిరోజూ చదివితే ఆర్ధిక సమస్యలు సమసిపోతాయి 

అది వినడం ఏమిటి కుమారస్వామి క్రౌంచాన్నిబ్రద్దలు చేశాడు. క్రౌంచనాశనం తో పాటు మహిషుడు చనిపోయాడు.

ఇంద్రుడి కళ్ళు అప్పుడే చల్లబడలేదు.

కుమారుడైన క్రౌంచపర్వతాన్ని కుమారస్వామి కూల్చివేశాడని తెలుసుకున్న  మేనమామ సునాభుడు పరిగెత్తుకు వచ్చాడు. 

సునాభుడు రావడం చూసి  బ్రహ్మ అశ్వినీ దేవతలు వసువులు అక్కడి నుంచీ వెళిపోయారు. ఇంద్రుడు అక్కడ నుంచీ మెల్లగా జారుకున్నాడని స్పష్టంగా పులస్త్యుడు చెప్పాడు.

మేనమామ పరిగెత్తుకు రావడం చూసి కుమారస్వామి శక్త్యాయుధాన్ని చేతపట్టి నిలిచాడు.

వెంటనే విష్ణుమూర్తి కుమారస్వామికి అడ్డుపడ్డాడు.

ఈ లోపల అక్కడకు చేరుకున్న హిమవంతుడు మనుమడి పతనం చూసినా తట్టుకొని కుమారుడు సునాభుడిని చెయ్యిపట్టుకొని సంఘటనా స్థలం నుంచీ లాక్కుపోయాడు.

దీంతో ఇంద్రుడు ఆశించింది సంపూర్తిగా జరగలేదు.

ప్రశాంతంగా తారకాసుర సంహారం జరిగింది.

కుమారస్వామి బంధునష్టకృత్యానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు.

అయితే యుద్ధంలో మకరాక్షుడి వల్ల ప్రాణాలు పొందిన వీరుడు చక్రాక్షుడు అవమానభారం పొంది బాణుడి చేతులు నరికే చక్రాయుధం కావాలని శివుని గురించి తపస్సు చేశాడు. శంభుడు ప్రత్యక్షమై ఆ వరాన్ని ఇచ్చాడు.

యుద్ధచరిత్రలో అతిముఖ్యమైనవి ఇవే. ప్రారంభమైన యుద్ధం దానితోనే పరిసమాప్తం కాదు. ఒకయుద్ధంతోనే ముగిసే యుద్ధకళలేనే లేదు. ప్రారంభం కాకూడదు కానీ ప్రాణభయంతో ఇంద్రుడి వంటి తుచ్ఛులు తమస్వార్థం కోసం తాము చేసిన తప్పులకు తమ తల తెగిపడకుండా తెలివిగా ఇతరుల మీదికి నెట్టి,  తాము గట్టున ఉండి  ఎప్పుడూ నిప్పురాస్తూనే ఉంటారు. వారి కంఠం నరకనిదే శాంతిపావురం ఎగరదు.  

Also Read : ఇలాంటి వారు ఎప్పటికీ ధనవంతులు కాలేరు

శాంతిరాదు.

శాంతి కావాలనుకుంటే యువత చేతి లోనే ఉంది. ఇటువంటి ‘‘పాముల‘‘ దుష్టపన్నాగాలు తెలుసుకోవాలి అంటే పురాణవిద్య తెలియాలి. ఇది సంస్కృతంలో ఉంది. మూలం చదివితేనే కానీ మూలతత్త్వం బోధపడదు. శ్రద్ధ ఉంటేనే జ్ఞానం లభిస్తుంది.

Famous Posts:

సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు

ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు

ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే

అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం

> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి

100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం

> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం

అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం

ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?

శుక్రవారం ఈ పనులు తప్పకుండ చేయాలి

tarakasura yuddha kala, tarakasur vadh, tarakasur vadh story in english, musti yuddha, tarakasura wife, tarakasur ramayan, tarakasur story in hindi, tarakasur vadh kartikeya, subrahmanya swamy, murugan, ayyappa swamy

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.